చెన్నై–లేహ్‌ సైకిల్‌ యాత్ర చేసిన  15 ఏళ్ల తెలుగు బాలుడు

5 Sep, 2022 09:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఆశిష్‌ చెన్నై నుంచి లద్దాఖ్‌ రాజధాని లేహ్‌ వరకు సైకిల్‌ మీద సాహసయాత్ర చేశాడు. కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్‌ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్‌ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు.

సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్‌ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్‌ మాట్లాడుతూ సైకిల్‌ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్‌ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు.

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరాలన్నదే తన కల అని ఆశిష్‌ పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్‌ చెప్పాడు.
చదవండి: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్‌ టవర్స్‌.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్‌

మరిన్ని వార్తలు