కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసుల దాడి: బాలుడు మృతి

22 May, 2021 11:19 IST|Sakshi

లక్నో: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పోలీసులు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కోవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల చర్యలు ఆ శాఖకు మచ్చ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లాలకు చెందిన 17ఏళ్ల బాలుడిని కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ కానిస్టేబుల్‌ చితకబాదాడు. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ్‌ జిల్లాలోని బంగర్మౌ పట్టణంలో భట్పురి ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలుడు తన ఇంటి బయట కూరగాయలు అమ్ముతున్నాడని స్థానిక పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. గాయాలకు తాళలేక బాలుడు సృహ తప్పి పడిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసుల చర్యతో ఆగ్రహించిన స్థానికులు ధర్మాకు దిగారు. దోషులపై  కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా బాధితుడి కుటుంబాని పరిహారం చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం  కల్పించాలన్నారు. కాగా, దీనిపై స్పందించిన పోలీసు శాఖ.. ఇద్దరు కానిస్టేబుల్స్‌, ఒక హోంగార్డును సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఇక కరోనా కేసులను అరికట్టడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే24 ఉదయం 7 గంటల వరకు ‘కర్ఫ్యూ’ విధించిన విషయం తెలిసిందే.


(చదవండి: Corona: ‘ఇండియన్‌ వేరియంట్‌’ కంటెట్‌ తొలగించండి)

(చడవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్)

>
మరిన్ని వార్తలు