‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?!

7 Sep, 2020 15:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక విధానాల వల్లనైతేనేమీ, ఆ తర్వాత ప్రాణాంత కరోనా వైరస్‌ మహమ్మారి విజంభణ వల్ల అయితేనేమీ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారింది. గడచిన రెండు దశాబ్దాలుగా జీడీపీ పురోభివద్ధితో ప్రపంచ పది బలమైన ఆర్థిక దేశాల్లో ఒకటిగా దూసుకుపోతోన్న భారత్‌కు హఠాత్తుగా కళ్లెం పడింది. మున్నెన్నడు లేని విధంగా ఈ ఆర్థిక త్రైమాసంలో ప్లస్‌లో దూసుకుపోతోన్న జీడీపీ వద్ధి రేటు అనూహ్యంగా మైనస్‌ 24 శాతానికి పడిపోయింది. ఇది మరింత దిగజారి మైనస్‌ 35 శాతానికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని భారత మాజీ చీఫ్‌ స్టాటిస్టిసియన్‌ ప్రణబ్‌ సేన్‌ అంచనా వేస్తున్నారు.

ప్రైవేటు పారిశ్రామీకరణ లేదా లైసెన్స్‌ రాజ్యాన్ని రద్దు చేస్తూ 1991లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకరావడంతో దేశాభివద్ధి రూటు మార్చుకుంది. అప్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లన ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు లబ్ధి పొందుతూ వచ్చారు. అవకతవక ఆర్థిక విధానాలకు కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ పరిస్థితులు తోడవడంతో దేశ ఆర్థిక పరిస్థితులు పతనమవుతూ వచ్చాయి. లాక్‌డౌన్‌ పరిస్థితులు కొనసాగడం వల్ల దేశంలో 1.80 కోట్ల మంది నెలసరి వేతన ఉద్యోగాలను కోల్పోయారని ‘సీఎంఐఈ’ నివేదిక తెలియజేస్తోంది. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల శాతం మున్నెన్నడు లేనివిధంగా 7.1 శాతానికి చేరుకుంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల మొదటిసారిగా దేశ మధ్యతరగతి ప్రజల్లో అసంతప్తి వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ దిగువ గ్రేడు ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన ‘స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఎగ్జామినేషన్‌’ ఫలితాల ఆలస్యంపై ఆన్‌లైన్‌లో మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికేతర సిబ్బంది నియామకం కోసం ‘రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ నిర్వహించాల్సిన పరీక్షలు జాప్యం జరగడం పట్ల కూడా ప్రజలు తమ అసహనం వ్యక్తం చేశారు. ‘పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థులు ఏకే–47 గన్‌లు పట్టుకోవాల్సి వస్తుంది’ అన్న ఘాటైన హెచ్చరికులు కూడా మొదలయ్యాయి.

అండర్‌ గ్రాడ్యువేట్‌ ఇంజనీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలనే ప్రజల డిమాండ్‌ను కేంద్రం ఖాతరు చేయక పోవడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వారం వారం రేడియో ద్వారా మాట్లాడే ‘మన్‌ కీ బాత్‌’లకు డిస్‌లైక్‌లు మొదలయ్యాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహ జ్వాలలు పునరావతం అవుతాయా?! నాడు టెలికామ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు, బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా నాడు ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైన విషయం తెల్సిందే.

మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీని, ఆయనకన్నా ఆయన పార్టీ బీజేపీని  ఇష్టపడతారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38 శాతం మంది మధ్యతరగతి వారు, 44 శాతం మంది ఉన్నత మధ్యతరగతి వారు మోదీ ప్రభుత్వానికి ఓటేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 61 శాతం మంది ఉన్నత హిందూ కులాలకు చెందిన ప్రజలు మోదీకి అండగా నిలిచారు. నేటి  పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వ విధానాల పట్ల అసంతప్తి వ్యక్తం అవుతున్నా అది మోదీని కాదనుకునే స్థాయికి చేరుకోవడం లేదు. వారికి ఆర్థిక విధానాల పట్ల అసంతప్తికన్నా మోదీ ప్రభుత్వం పట్ల వారికి సైంద్ధాంతిక కట్టుబాటే ఎక్కువగా ఉంది. 

మరిన్ని వార్తలు