భార్యభర్తల గొడవలో బలైన మూడేళ్ల చిన్నారి!

14 Sep, 2020 09:41 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు మూడేళ్ల పసిపాప బలైయ్యింది. భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండగా కోపంతో ఆమె భర్త పసి పాపను నేలకు వేసి బలంగా కొట్టాడు. దీంతో పాప అక్కడికి అక్కడే మరణించింది. ఈ సంఘటనలో పాప తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. 

సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోలా గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరే సమయానికి మహిళ తీవ్రంగా గాయపడినట్లు, చిన్నారి అప్పటికే మరణించినట్లు  అధికారులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు నోయిడా అదనపు పోలీస్‌ కమిషనర్‌ రణవిజయ్‌ సింగ్‌ చెప్పారు.  నిందితుడు రోజు మద్యం సేవించి, భార్యతో తరచూ గొడవలు పడేవాడని చుట్టు పక్కల వారు తెలిపారు. నిన్న గొడవ జరిగే సమయంలోనూ అతడు మందు తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడిని బులంద్షహర్‌ జిల్లాకు చెందిన అమిత్‌గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నోయిడాలో పనిచేసే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాప చనిపోయిందన్న విషయాన్ని అతడు తన భార్య రేణు కుటుంబానికి సమాచారం ఇచ్చాడని, అయితే పాప చనిపోవడానికి గల కారణాన్ని వారికి తప్పుగా చెప్పాడని అతని అత్తమామలు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, అమిత్‌ను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

చదవండి: చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు 

>
మరిన్ని వార్తలు