స్కూల్స్‌లో కరోనా కలకలం.. 31 మం‍ది విద్యార్థులకు పాజిటివ్‌.. టెన్షన్‌లో అధికారులు

15 Jun, 2022 18:19 IST|Sakshi

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, ఇటీవలే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. 

తాజాగా కర్నాటకలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 31 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. న్యూ స్టాండర్డ్ పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎంఈఎస్‌ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే వీరందరూ కరోనా బారినపడటం ఆందోళక కలిగిస్తోంది. ఇక, సదరు విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ చేసే సమయంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారు కరోనా బారినపడినట్టు తెలిసిందే. 

దీంతో, అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం వెంటనే రెండు పాఠశాలలను శానిటైజ్‌ చేపించారు. మరోవైపు.. కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, సిబ్బందికి తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉంటే.. వారికి వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. సిబ్బందికి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారో లేదో స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించింది. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 582 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా టెన్షన్‌.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు!

మరిన్ని వార్తలు