మరో ముప్పు.. 33 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు

13 May, 2021 04:17 IST|Sakshi

బెంగళూరులో 33 మందికి చికిత్స

సాక్షి, బెంగళూరు: రాష్ట్రం ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతం అవుతున్న దశలో మరో ఇబ్బంది వచ్చింది. బెంగళూరులో 33 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. వీరికి వివిధ ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నట్లు బీబీఎంపీ ఆరోగ్య అధికారి విజయేంద్ర తెలిపారు. కోవిడ్‌ రోగులకు, కోలుకున్నవారిలో కొందరికి ఈ జబ్బు సోకుతున్నట్లు వార్తలు వచ్చాయి. మధుమేహం ఉన్న కోవిడ్‌ రోగులకు సోకే ప్రమాదముందని నిపుణులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారి మాట్లాడుతూ ఫంగస్‌ సోకిన వారికి వైద్యం అందిస్తూ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పాటు ఫంగస్‌తో బాధపడే రోగులకు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలలో చికిత్సలందిస్తామని చెప్పారు. 

త్వరలో చికిత్సా విధానం: మంత్రి  
రాష్ట్రంలో త్వరలో 780 మంది స్పెషలిస్ట్‌ వైద్యులతో పాటు మొత్తం 2480 మంది డాక్టర్లను నియమిస్తామని ఆరోగ్యమంత్రి సుధాకర్‌ తెలిపారు.  బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిపై కోవిడ్‌ సాంకేతిక సమితితో చర్చించా, వారు గురువారం నివేదిక ఇస్తారన్నారు. బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్సా విధానం ఏమిటనేది చూడాలి. ఇందుకు మహారాష్ట్రలో ఉచితంగా వైద్యమందిస్తున్నట్లు తెలిసిందన్నారు. కరోనా ఇండియన్‌ వేరియంట్‌ బ్రిటిష్‌ వేరియంట్‌ కంటే కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తోందని గుర్తించామన్నారు.  

మరిన్ని వార్తలు