35 వాట్సాప్‌ గ్రూప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?

20 Jun, 2022 09:38 IST|Sakshi

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్‌ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్‌ పథకం, అగ్నివీర్‌లకు సంబంధించి వాట్సాప్‌ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. 

దీంతో,  35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్‌ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్‌ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దాడుల నుంచి మొదలు కొని బీహార్‌లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్‌ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

ఇది కూడా చదవండి: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు

మరిన్ని వార్తలు