తీవ్ర ప్రరిణామాలు తప్పవు.. ‘స్మార్ట్‌’ వినియోగంపై విస్తుపోయే నిజాలు

25 Jul, 2021 13:39 IST|Sakshi

10 ఏళ్లకే 37.8% మందికి ఫేస్‌బుక్‌ ఖాతాలు

24.3 శాతం మందికి ఇన్‌స్టాగ్రామ్‌

న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్‌బుక్‌ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది  టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్‌లైన్‌ క్లాసుల కోసం వాడుతున్నారు.

40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్‌ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్‌ను, 10.1శాతం మంది ఆన్‌లైన్‌లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు  76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్‌ ఎక్కాకా ఫోన్‌ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్‌ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.  

మరిన్ని వార్తలు