16 రోజులుగా.. 50 వేల లోపే..

24 Nov, 2020 05:59 IST|Sakshi

కరోనా రికవరీ 93.68 శాతం 

కర్ణాటకలో డిసెంబర్‌లోనూ స్కూళ్ల మూసివేత

ఢిల్లీలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 16 రోజులుగా బయటపడుతున్న కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేలకు మించట్లేదు. గత  24 గంటల్లో 44,059 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,865కు చేరుకుం దని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 511 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,738కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సోమవారానికి 85,62,641కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.68 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,43,486 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.85 శాతం ఉన్నాయి. 

నగరాల్లో విస్తరిస్తున్న మహమ్మారి
నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంలో పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు  విధిస్తున్నారు. కేసుల తంతు ఇలాగే కొనసాగితే నగరాల వరకు లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు మళ్లీ రావచ్చని భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే  వ్యాక్సినేషన్‌ చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారత్‌లో అయిదు  సంస్థలు వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్నాయి. ఇలా ఉండగా, డిసెంబర్‌ మూడో వారం వరకు విద్యా సంస్థలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.  కరోనా తీవ్రత దృష్ట్యా పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని రెండు మార్కెట్‌లను ఈనెల 30 వరకు మూసివేయాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

కోవిడ్‌ చికిత్సలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ విద్యార్థులకు అవకాశం
ఎంబీబీఎస్, బీడీఎస్, నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం విద్యార్థులు, ఇంటర్న్స్‌ ని డ్యూటీ డాక్టర్లకు సహాయం చేయడానికి అనుమతిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రు ల్లోని కోవిడ్‌ ఐసీయూలలో ఎదుర్కొంటోన్న వైద్యుల కొరతను అధిగమించడానికి ఈ విధుల్లో చేరే విద్యార్థులకు ఎనిమిది గంటల షిఫ్ట్‌కి 1,000 రూపాయలు, 12 గంటల షిఫ్ట్‌కి 2,000 రూపాయలు, గౌరవ వేతనం ఇస్తారు. ఇంటర్న్స్‌కి ఇచ్చే స్టైపెండ్‌కి ఈ గౌరవ వేతనం అదనమని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు