-

మాస్క్‌ లేకుండా నెలరోజుల్లోనే లక్షన్నర మంది.. 

29 Jun, 2021 19:30 IST|Sakshi

మాస్కు లేకుండా తిరుగుతున్న వారిపై బీఎంసీ చర్యలు 

రూ.3 కోట్లపైనే జరిమానా వసూలు

సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పట్డంతో ముంబైకర్లలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. భౌతికదూరం పాటించకపోవడమేగాకుండా ముఖానికి మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బీఎంసీ సిబ్బంది దాడులు మరింత తీవ్రం చేశారు. గడిచిన నెల రోజుల్లో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న లక్షన్నరకుపైగా మందిపై చర్యలు తీసుకున్నారు. వారి నుంచి రూ.3 కోట్లపైనే జరిమానా వసూలు చేశారు. ఇలా ఇప్పటి వరకు బీఎంసీ ఖజానాలోకి ఏకంగా రూ.58 కోట్ల మేర అదనంగా ఆదాయం వచ్చి చేరింది.  

రెండు కాదు ఒక్కటీ లేదు.. 
రెండో వేవ్‌ కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం ఇంకా పొంచే ఉందని తరుచూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. బీఎంసీ సిబ్బంది, క్లీన్‌ అప్‌ మార్షల్స్‌ కూడా దాడులు కొంతమేర తగ్గించారు. దీంతో ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. భౌతికదూరం ఎలాగో ఎవరు పాటించడం లేదు. కనీసం మాస్క్‌ ధరిస్తే కరోనా కొంతైన నియంత్రణలో ఉంటుంది.  మాస్క్‌ కూడా ధరించకపోవడంతో దాడులు మళ్లీ ఉధృతం చేయాల్సి వచ్చింది.

 
క్లీన్‌ అప్‌ మార్షల్‌లో చేపట్టిన దాడుల్లో మాస్క్‌ లేకుండా తిరగుతున్న 4,180 మందిని పట్టుకుని వారి నుంచి రూ.8.36 లక్షలు జరిమానా వసూలు చేశారు. పోలీసులు 1,161 మందిని పట్టుకుని రూ.2.32 లక్షలు జరిమానా వసూలు చేశారు. మాస్క్‌ లేకుండా తిరిగే వారి సంఖ్య పెరిగిపోవడంతో వారిని పట్టుకునేందుకు క్లీన్‌ అప్‌ మార్షల్స్‌ సంఖ్య పెంచాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ప్రతీరోజు సుమారు 25 మందిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ టార్గెట్‌ విధించారు. లోకల్‌ రైల్వే హద్దులో కూడా రైల్వే పోలీసులు దాడులు ముమ్మరం చేయడంతో అక్కడ పరిస్ధితులు అదుపులో ఉన్నాయి. ఒకపక్క ప్రభుత్వం రెండు మాస్క్‌లు ధరించాలని చెబుతుంటే మరోపక్క రోడ్లపై తిరిగే జనాలు మాస్క్‌ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని దీన్ని బట్టి తెలుస్తోంది.

మరిన్ని వార్తలు