జనవరి నుంచి భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

16 Jun, 2021 19:09 IST|Sakshi

లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు  

కరోనా మహమ్మారి వల్ల దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా విషాద ఛాయలు మిగిలిచింది. కొందరు తమ ఆప్తుల్ని కోల్పోతే, మరి కొందరు ఆర్ధికంగా నష్ట పోయారు. గత ఏడాది మార్చిలో లాక్ డౌన్ విధించడం వల్ల అప్పుడు చాలా మంది జీవితాల మీద కత్తి వేలాడింది. కొందరు మానసిక భాదను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దేశంలో ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయి. మధ్యలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికి తిరిగి విజృంభించడంతో ఇంకా దేశంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2021 మేలో 11.9 శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు జూన్ ప్రారంభం వరకు పెరుగుతూనే ఉంది. జూన్ నెలలో కేసులు తగ్గుముఖం పట్టిన కూడా నిరుద్యోగ రేటు 13శాతానికి చేరుకుంది. అసంఘటిత రంగంలో లాక్ డౌన్ కారణంగా కోల్పోయిన ఉద్యోగాలు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని రంగాలలో ఇంకా ఇప్పటికీ నియామకాలు జరగ లేదు. సీఎంఐఈ ప్రకారం, జనవరి 2021 నుంచి కోల్పోయిన మొత్తం వ్యవసాయేతర ఉద్యోగాల సంఖ్య 36.8 మిలియన్లు ఉంటే ఇందులో రోజువారీ వేతన కార్మికులు 23.1 మిలియన్ల మంది ఉన్నారు. ఇంకా వేతన ఉద్యోగులు 8.5 మిలియన్ల మంది ఉన్నారు. కొన్ని కంపెనీలు కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అనే కారణం చేత ఇప్పటికీ నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..?

మరిన్ని వార్తలు