మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్‌ హీట్‌..

2 Dec, 2020 11:17 IST|Sakshi

కశ్మీర్‌ లో స్థానిక ఎన్నికల సందడి

రెండవ దశలో 48 శాతానికి పైగా పోలింగ్‌

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌లో 48.62 శాతం ఓటింగ్ నమోదైంది. జమ్మూ ప్రాంతంలో 65.54 శాతం, కశ్మీర్ లోయలో సగటున 33.34 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ మీడియాతో తెలిపారు. 43 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. అందులో కశ్మీర్‌లో 25, జమ్మూ డివిజన్‌లో 18 ఉన్నాయి. బందిపురా జిల్లాలో అత్యధికంగా 69.66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్‌తో కేంద్రపాలిత ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉంది. నవంబర్ 28న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 51.76 శాతం  ఓట్లు నమోదయ్యాయి.

ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టులో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఇది మొదటి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. పూంచ్‌లో అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదవ్వగా, పుల్వామా మొదటి దశలో మాదిరిగానే 8.67 శాతం ఓటింగ్‌తో చివర స్థానాన్ని నిలుపుకుంది. మొదటి దశలో కశ్మీర్‌లో 25, జమ్మూ ప్రాంతంలో 18 సహా 43 స్థానిక సంస్థ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది.

కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడా సమస్యలు రాకుండా శాంతియుతంగా ఎన్నికలు ముగిశాయి. లోయలో పోల్ శాతం తగ్గినప్పటికీ కొంతమేరకు ప్రజలు ఓట్లు వేశారని శర్మ పేర్కొన్నారు. 'జిల్లా స్థాయిలో అభివృద్ధికి అభ్యర్థులను ఎన్నుకోవడంలో ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఓటు వేయమని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మేము అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. కానీ చివరికి ప్రజలు చేయవలసినది ఓటు వేయడం' అని ఆయన తెలిపారు.   చదవండి:  (పార్కింగ్‌ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం)

మరిన్ని వార్తలు