సిలిండర్‌ పేలి ఐదుగురు దుర్మరణం

24 Nov, 2021 06:19 IST|Sakshi

తమిళనాడులో ఘటన

సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్‌ పట్టి పాండురంగన్‌ విట్టల్‌ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి.

ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న పద్మనాభన్‌ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్‌ తల్లి స్టౌవ్‌ వెలిగించే సమయంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్‌ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు