సుప్రీంకోర్టులో సగం మందికి కరోనా... వర్క్‌ ఫ్రమ్‌ హోం‌

12 Apr, 2021 10:42 IST|Sakshi

కోర్టు గదలు, ఆవరణను శానిటైజ్ చేస్తున్న అధికారులు

నేడు ఓ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా లక్ష 68 వేలకు పై చిలుకు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బారినపడటంతో ఇక మీదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. తాజా కోవిడ్‌ కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి. కాగా, శనివారం ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది.

‘‘నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనా బారినపడ్డారు’’ అని ఓ న్యాయమూర్తి తెలిపారు. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా.. ఆ తర్వాత కోలుకున్నారు. ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. నేడు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. కోవిడ్‌ బారిన పడి 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

చదవండి: టీకా ఉత్సవ్‌.. కోవిడ్‌పై అతి పెద్ద యుద్ధం

మరిన్ని వార్తలు