ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..అయినా దక్కని ప్రాణాలు

15 Jan, 2023 12:05 IST|Sakshi

ఇండిగో విమానంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినప్పటికీ.. ప్రయాణికుడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన ఇండోర్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2088లో ఒక ప్రయాణికుడి కారణంగా ఇండోర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అతుల్‌ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికిఅకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత కాసేపటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో పైలట్‌ విమానాన్ని ఇండోర్‌లోని దేవి అహల్యబాయి హోల్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశాడు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఇండిగో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ ప్రబోధ్‌ చంద్ర శర్మ మాట్లాడుతూ...మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగానే.. విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ ప్రబోధ్‌ చంద్ర శర్మ చెప్పారు.

వాస్తవానికి సదరు ప్రయాణికుడు గుప్తా అప్పటికే మధుమేహం, తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో విమానం సాయంత్రం 6.40 నిమిషలకు న్యూఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు. ఐతే మృతుడు గుప్తా నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం తదనంతరం బంధువులకు అతని మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.  

(చదవండి: ఇండయన్‌ ఆర్మీ డే! సెల్యూట్‌..సైనికుడా..!)

మరిన్ని వార్తలు