-

Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా 

6 Jan, 2022 15:19 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ జేజే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 61 మంది రెసిడెంట్‌ డాక్టర్లకు కరోనా సోకింది. ఈ విషయం స్వయంగా రెసిడెంట్‌ డాక్టర్ల సంఘం వెల్లడించింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు 61 మంది నివాస డాక్టర్లకు కరోనా సోకడంతో ఇంటికే పరిమితం కావల్సిన పరిస్ధితి వచ్చింది. ఇది ఆస్పత్రి వైద్య సేవలపై తీవ్రంగా ప్రభావం చూపే ఆస్కారముందని మార్డ్‌ అధ్యక్షుడు డా.అవినాశ్‌ దహిఫళే బుధవారం తెలిపారు. ఒకేరోజు, ఒకే ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఖ్యలో డాక్టర్లకు కరోనా సోకడం కలకలం కలిగిస్తోంది. డాక్టర్ల కొరత కారణంగా ఇప్పటికే ఓపీడీ సేవలు సక్రమంగా సాగడం లేదు.

చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..)

గడచిన 24 గంటల్లో మొత్తం 120 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మరికొంత మంది సైతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అవినాశ్‌ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం వార్డులో చికిత్స పొందుతున్న రోగులపై పడుతోందని చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఇదివరకే అనేక మంది రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో తరుచూ ఆందో ళన, సమ్మెకు దిగుతున్నారు. ఫలితంగా అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లలో కరోనా పాజిటివ్‌ ఇలాగే పెరిగితే పరిస్థితి వైద్య సేవలలో అంతరాయం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వైద్య, విద్యా శాఖ, రీసర్చ్‌ డైరెక్టర్ల మండలి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అవినాశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం)

మరిన్ని వార్తలు