Mumbai-Goa Highway Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా 9 మంది మృతి

19 Jan, 2023 10:33 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్‌ జిల్లా మంగావ్‌ ప్రాంతంలోని ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితోపాటు తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రేపోలి గ్రామం వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితులందరూ బంధువులని, కారులో రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు.

మరిన్ని వార్తలు