పరీక్షల్లో అందరూ ఫెయిల్‌

13 Aug, 2021 07:49 IST|Sakshi

కలెక్టర్‌కు డైట్‌ విద్యార్థుల ఫిర్యాదు    

సాక్షి, చెన్నై : పరీక్ష రాసిన విద్యార్థుల్లో 99 శాతం మందిని అధికారులు ఫెయిల్‌ చేశారని ఆరోపిస్తూ 2019–20 సంవత్సరానికి చెందిన డైట్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు గురువారం కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతిపత్రం సమర్పించారు. కరోనా వేగంగా విస్తరించిన నేపథ్యంలో గత ఏడాది పూర్తిగా క్లాసులను రద్దు చేసి ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించారు. దీంతో పాటు పరీక్షలను సైతం రద్దు చేసి ఆల్‌పాస్‌ను ప్రకటించారు. అయితే తరగతులను నిర్వహించకుండానే టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తున్న విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు జిల్లా నుంచి సుమారు రెండు 2వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలను ప్రభుత్వం ఇటీవల వెలువరించిన నేపథ్యంలో 99 శాతం మంది ఫెయిల్‌ అయినట్లు వెబ్‌సైట్‌లో ప్రకటించారు. సింగిల్‌ డిజిట్‌ మార్కులకు పరిమితం చేశారని, బాగా చదివి పరీక్షలు రాసినా అందరినీ ఫెయిల్‌ చేశారని ఆరోపిస్తూ గురువారం  కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హమీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు