న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,023 మంది కోవిడ్తో మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 60,472కు చేరింది. ఇక భారత్లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది.(చదవండి: 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా: సీఎం)
రికవరీ రేటు 76 శాతం
కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ రికవరీ రేటు 76.24 శాతానికి చేరడం సానుకూల అంశంగా పరిణమించింది. కాగా దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93గా ఉండగా.. కరోనా మరణాల 1.83 శాతానికి తగ్గింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 9,24,998. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కోవిడ్ టెస్టుల సంఖ్య 3,85,76,510గా ఉంది.