మీకు రెండే ఆప్షన్స్‌ ఉన్నాయి.. రెబల్స్‌కు ఆదిత్య థాక్రే వార్నింగ్‌

27 Jun, 2022 09:42 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌పై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్‌ వర్గం, రెబల్‌ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

తాజాగా.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాక్రే.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై విరుచుకుపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దోశద్రోహులు అని పేర్కొన్నారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు.  ద్రోహులుగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆదిత్య థాక్రే అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు.

ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండేకు తమను ఎదుర్కొనే దమ్ములేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తిరుగుబాటు చేసే ధైర్యం లేక గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి.. పార్టీ నేతలతో తిరుగుబాటు చేశారని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా అసోంకు తరలించారని అన్నారు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేకు రెండు ఆప‍్షన్స్‌ ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం లేదా ప్రహార్‌లో చేరడం అని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఏక్‌నాథ్‌ షిండే మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది.. 

మరిన్ని వార్తలు