షెల్లీ ఒబెరాయ్‌: ఢిల్లీ మేయర్‌ పీఠంపై మాజీ ప్రొఫెసర్‌.. ఆమె నేపథ్యం ఇదే

22 Feb, 2023 15:13 IST|Sakshi

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టింది ఆప్‌. డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో.. ఆప్‌ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలపై సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో.. మేయర్‌ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఊరటతో ఆప్‌ విజయం సునాయసమైంది. ఆ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌.. బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్‌ ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే..

షెల్లీ ఒబెరాయ్‌(39).. హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో ఉన్నత డిగ్రీ పూర్తి చేశారు.  ఐఐఎం కోజికోడ్‌(కేరళ)లో మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశారు.    ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా గతంలో పని చేసిన ఆమె.. మొట్టమొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈస్ట్‌ పటేల్‌ నగర్‌ వార్డ్‌(86వ వార్డ్‌) నుంచి ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. 2013-14 నుంచి ఆప్‌లో కొనసాగుతున్న ఆమె.. 2020లో మహిళా మోర్చా విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రచార సమయంలో షెల్లీ ఒబెరాయ్‌ జనాల్లోకి వెళ్లిన తీరుపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది.

షెల్లీ ఒబెరాయ్‌.. ఇండియన్‌ కామర్స్‌ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్‌. ఇందిరా గాంధీ ఒపెన్‌ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్‌ నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.

షెల్లీ ఒబెరాయ్‌ తండ్రి సతీష్‌ కుమార్‌ వ్యాపారవేత్త. తల్లి సరోజ్‌ గృహిణి. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. కిందటి నెలలో మేయర్‌ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే తాజాగా ఆప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.

::సాక్షి ప్రత్యేకం  

మరిన్ని వార్తలు