ప్రైమరీ టీచర్లకు ఫిన్‌లాండ్‌లో శిక్షణ: ఆప్‌ వర్సస్‌ గవర్నర్‌ మధ్య రగడ

13 Jan, 2023 15:15 IST|Sakshi

ఆప్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల మధ్య మళ్లీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 30 మంది ప్రైమరీ టీచర్లను ఫిన్‌లాండ్‌కి శిక్షణ నిమిత్తం పంపాలన్న ప్రణాళిక నేపథ్యంలో ఇరువురు మధ్య మాటల ఘటర్షణకు దారితీసింది. ఐతే లెఫ్టినెంట్‌ గర్నర్‌ టీచర్ల పర్యటనను రద్దు చేసేలా ప్రశ్నలు సంధించారంటూ డిప్యూటీ మంత్రి మనీష్‌ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

ఈ మేరకు సిసోడియా ట్విట్టర్‌లో..."ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసం విదేశాలకు పంపించే తొలి ప్రభుత్వం ఇది. గవర్నర్‌ దేశంలోనే  టీచర్లకు శిక్షణ ఎందుకు ఇవ్వకూడదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా పిల్లల భవిష్యత్తుకు ఖరీదు కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీని టార్గెట్‌ చేస్తూ..దావోస్‌ లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలకు వెళ్లే మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..కుటుంబాలతో సహా వెళ్లే మంత్రుల గురించి ప్రశ్నించారు. అప్పుడూ ఖర్చు, ప్రయోజనాల గురించి ఆలోచించారా! అని నిలదీశారు. పిల్లల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యంగ విరుద్ధంగా భావిస్తున్నారు.

మీకు ముకుళిత హస్తలతో జోడించి మరీ  చెబుతున్న ఢిల్లీ విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకునే కుట్రలో ఒక లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బీజేపీకి సాయం చేయొద్దు" అని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు సిసోడియా. ఐతే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఇది సరికాదని తాము ఫిన్‌లాండ్‌లో ప్రైమరీ టీచర్‌లకు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించలేదని గవర్నర్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆప్‌ తన అహం కోసం ఏదిపడితే అది చేయడం మానుకోవాలి.

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆ వివరాలు అడిగే హక్కు ఆయనకు ఉంది. అయినా ఖర్చుల వివరాల గురించి వివరణ ఇవ్వడంలో సమస్య ఏమిటి ?. ఉపాధ్యాయుల గురించి ఇంత ఆందోళన చెందుతున్నప్పుడూ..ఇంకా నలుగురు ఉపాధ్యాయులకు ఎందుకు జీతాలను చెల్లించలేకపోయారు అని బీజేపీ పార్టీ నాయకుడు హరీష్‌ ఖురానా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ప్రభత్వ సందేశాలుగా ఇచ్చే రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేసిన సుమారు రూ. 163.62 కోట్లను దాదాపు 10 రోజుల్లో చెల్లించాలని ఆప్‌ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో ఢిల్లీలోని దాని కార్యాలయం, ఇతర ఆస్తులను సీలు చేస్తామని గవర్నర్‌ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది కూడా. 

(చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్‌! మేడమ్‌ అని పిలవకూడదు! విద్యాశాఖకు కీలక ఆదేశాలు)

మరిన్ని వార్తలు