విద్యాశాఖ బలోపేతానికి ‘స్టార్స్‌’

15 Oct, 2020 02:12 IST|Sakshi

ఆమోదించిన కేంద్ర కేబినెట్‌

న్యూఢిల్లీ: పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద ‘స్టార్స్‌’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో భాగంగా స్ట్రెంథెనింగ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌ (స్టార్స్‌) ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్‌ ప్రాజెక్టుకి  ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ‘‘చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దాం’’ అని జవదేకర్‌ చెప్పారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్‌ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నట్టు చెప్పారు.  

రూ.520 కోట్ల ప్యాకేజీ..
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్‌ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని జవదేకర్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు