వ్యాక్సిన్లపై పుకార్లు సృష్టించేవారిపై చర్యలు

26 Jan, 2021 02:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌లపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని గుర్తించి, అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. అందులో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ తయారుచేస్తోన్న కోవాగ్జిన్‌ సురక్షితమైనవి అజయ్‌ భల్లా అన్నారు.

ఈ రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని దేశంలోని నేషనల్‌ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తయారు చేస్తోన్న ఈ రెండు వ్యాక్సిన్‌ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు జనవరి 16 కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అయితే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్‌ల సమర్థతపై అనేక అనుమానాలకు తావిస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిపట్టించే ప్రయత్నం సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు.   

మరిన్ని వార్తలు