బీజేపీలోకి యంగ్‌ హీరో..!

17 Feb, 2021 14:41 IST|Sakshi

కోల్‌కత్తా : బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. కాంగ్రెస్‌-వామపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ పోటీఅంతా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే ఉండనుంది. వరుస రెండు ఎన్నికల్లో తిరుగలేని ఆధిపత్యం ప్రదర్శించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని బుల్లెట్‌ వేగంతో దూసుకువచ్చిన కాషాయదళం తొలిసారి బెంగాల్‌ కోటపై జెండాఎగరేయాలని కలలు కంటుందో. పదేళ్లుగా  రాష్ట్రాన్ని పాలిస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగిన దీదీకి ఇక చెక్‌పెట్టాలని భావిస్తోంది. దీనికి తగట్టుగానే వ్యూహరచన చేస్తోంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున టీఎంసీ నుంచి కీలక నేతల్ని బీజేపీలో చేర్చుకుంది.

అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలను ఆకర్శించే విధంగా ప్రముఖులపై గాలం వేస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ (బెంగాల్‌ చిత్రపరిశ్రమ) యంగ్‌ హీరో యాష్‌ దాస్‌గుప్తాను పార్టీలోకి ఆహ్వానించింది. బీజేపీ పిలుపుమేరకు గురు, శుక్రవారాలలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సమీప వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. కాగా 2016లో విడుదలైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రంతో యాష్‌ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటింటి ఆయనకంటూ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి, దాస్‌గుప్తా మధ్య ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె టీఎంసీలో చేరిన అనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక  బీజేపీలో చేరికపై దాస్‌గుప్తా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?

మరిన్ని వార్తలు