భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అప్పుడే!

28 Oct, 2020 16:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ర్టాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ డిసెంబర్‌ నాటికి సిద్ధమవుతుందని పుణేకు చెందిన ఆ సంస్థ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా వెల్లడించారు. పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో తొలి బ్యాచ్‌ 2021 రెండు లేదా మూడో త్రైమాసికంలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

భారత్‌లో డిసెంబర్‌ నాటికి మానవ పరీక్షలు పూర్తవుతాయని, బ్రిటన్‌లో పరీక్షలు కూడా ముగిసిన పక్షంలో భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్‌ లాంఛ్‌ చేస్తామని ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదార్‌ పూనావాలా పేర్కొన్నారు. బ్రిటన్‌లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తయి..వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రత మెరుగ్గా ఉందని వెల్లడైతే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కొన్ని వారాల ప్రక్రియని, దీనిపై తాను ఊహించి చెప్పలేనని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

ఇక వ్యాక్సిన్‌ పూర్తిస్ధాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడిస్తూ తొలిబ్యాచ్‌గా 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను వచ్చే ఏడాది రెండు, మూడు త్రైమాసికాల్లో (జూన్‌-సెప్టెంబర్‌) మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం చేసుకుంది. చదవండి : ఏడాదికి 50 కోట్ల డోసులు

>
మరిన్ని వార్తలు