ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు చేయండి 

17 Dec, 2022 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అద్దంకి నేతృత్వంలో ఐదు రోజులుగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సహా ఇతర కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తెలంగాణ సామాజిక కాంగ్రెస్‌ బృందం బీసీ, ఎస్సీ, ఎస్టీల అంశాలు, సమస్యలపై చర్చించారు.

శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయా లని చేసిన విజ్ఞప్తిపై పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అంతేగాక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్‌ పార్టీకి దూరం కావడానికి గల కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని అద్దంకి వివరించారు. వీటితో పాటు ఎనిమిదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ధరణి కారణంగా దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.  

(చదవండి: మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!)

మరిన్ని వార్తలు