జమ్ము కశ్మీర్‌లో అఫ్గాన్‌ యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

31 Aug, 2021 19:33 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

జమ్మూ కశ్మీర్‌: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశప్రజలు భయంతో ఇతర సరిహద్దు దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే తాజాగా అఫ్గాన్‌కు చెందిన ఓ యువకుడు జమ్ము కశ్మీర్‌లోకి ప్రవేశించి.. కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ కోవిడ్‌ నిర్ధారణ కేంద్రంలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వివరాల ప్రకారం.. అబ్దుల్ రెహ్మాన్(17) అఫ్గాన్‌ దేశానికి చెందిన అబ్దుల్ రషీద్ అహ్మద్ కుమారుడు. అతను మంగళవారం ఉదయం 6.30 సమయంలో భారత్‌లోనికి ప్రవేశించి కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతంలో ఉన్న కోవిడ్‌ నిర్ధారణ కేంద్రంలో కరోనా టెస్ట్‌ చేసుకోవడానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. 

చదవండి: Talibans: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు

అతని సోదరుడు ఢిల్లీలోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని బాలుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ యువకుడు కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతానికి ఎలా ప్రవేశించాడనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అబ్దుల్ రెహ్మాన్ వద్ద ఇరు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

తన పాస్‌పోర్టు, వీసా భారత్‌లోని అఫ్గానిస్తాన్‌ రాయబార కార్యాలయంలో ఉన్నాయని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. అఫ్గానిస్తాన్‌ రాయబార కార్యాలయ అధికారుల నుంచి యువకుడి పాస్‌పోర్టు, వీసాకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని పోలీసులు తెలిపారు. అబ్దుల్ రెహ్మాన్ భారతదేశంలోకి ఎలా ప్రవేశించాడనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: తాలిబ‌న్ల‌ను పొగిడిన పాక్ క్రికెట‌ర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజ‌న్లు

మరిన్ని వార్తలు