‘నా భార్యను అందుకే హత్య చేశాను’ అంటూ పోలీసులకు లొంగిపోయిన భర్త!

30 May, 2023 08:09 IST|Sakshi

భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే దంపతులలో ఎవరైనా వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే వారి బాంధవ్యం బీటలు వారుతుంది. అప్పుడు పరిస్థితులు ఎంతవరకైనా దారితీస్తాయి. ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్‌ దెహాత్‌ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్య గొంతునులిమి హత్యచేశాడు.

తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి సరెండర్‌ అయ్యాడు. అతను పోలీసులకు ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రసూల్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కండవర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి చెందిన ములాయం సంఖ్వార్‌ భార్య ఖుష్బూ కొన్ని రోజుల క్రితం వారి ఎదురింటిలో ఉంటున్న ఆమె ప్రేమికుడు వివేక్‌తో పాటు ఎక్కడికో వెళ్లిపోయింది.

ఈ నేపధ్యంలో ములాయం సంఖ్వార్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ ఉదంతం పోలీస్‌స్టేషన్‌ వరకూ చేరుకుంది. అక్కడ భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిరిద్దరూ తిరిగి కలిసివుండసాగారు. అయితే భార్య గతంలో ప్రియుడితో వెళ్లిపోయిన విషయాన్ని ములాయం సంఖ్వార్‌ మరచిపోలేకపోయాడు. దీంతో గత మూడు రోజులుగా భార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ములాయం తన భార్య ఖుష్బూ గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు