వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం
విత్తనాలు, ఎరువులు, కోత, మార్కెటింగ్ అన్ని దశల్లోనూ స్టార్టప్స్ సేవలు
2025 నాటికి 24.1 బిలియన్ డాలర్లకు దేశీ అగ్రిటెక్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘దేశానికి వెన్నెముక రైతు’ అంటారు. కానీ, నేటి సాంకేతిక యుగంలో రైతుకే వెన్నెముకలా నిలుస్తున్నాయి అగ్రి స్టార్టప్స్. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ సమయంలో దేశంలో అన్ని రంగాలు క్షీణిస్తే.. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే స్థిరమైన వృద్ధిని సాధించింది. ఇందుకు కారణం.. వ్యవసాయ పనుల్లో సాంకేతికతను వినియోగించటమే. వాతావరణం, నేల పరీక్షల నుంచి మొదలుపెడితే.. నాట్లు, ఎరువుల పిచికారీ, పంట నిర్వహణ, కోత, ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్, ధరల నిర్ణయం, గిడ్డంగులు, రుణాలు ఇలా ప్రతి దశలోనూ అగ్రి స్టార్టప్స్ అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి.
మనది వ్యవసాయ ఆధారిత దేశం. 58 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అగ్రి స్టార్టప్స్ 50-60 వరకుంటాయి. అగ్రిస్టార్టప్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆ్రస్టేలియా, అమెరికా, స్విట్జర్లాండ్ ఎక్కువగా ఉంటాయి. భూమి ఎక్కువగా అందుబాటులో ఉండటం, విరివిగా ఆధునిక సాంకేతిత వినియోగం, రైతుల అక్షరాస్యత, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. మన దేశంలో అగ్రి స్టార్టప్స్ను ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్లు ముందు వరుసలో ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహం, చాలా వరకు అగ్రి స్టార్టప్స్ ప్రమోటర్లు ఆయా రాష్ట్రాల నుంచే ఉండటం దీనికి ప్రధాన కారణాలని ఓరిగో కమోడిటీస్ కో-ఫౌండర్, డైరెక్టర్ సునూర్ కౌల్ తెలిపారు.
దేశీయ అగ్రిటెక్ స్టార్టప్స్ 2014 నుంచి 2020 సెప్టెంబర్ వరకు 467 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025 నాటికి దేశీ అగ్రిటెక్ మార్కెట్ 24.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇక్42 అంచనా వేసింది. మొత్తం అగ్రిటెక్ మార్కెట్ టర్నోవర్ 170 బిలియన్ డాలర్లు కాగా.. ఇప్పటివరకు 204 మిలియన్ డాలర్ల మార్కెట్ను మాత్రమే అగ్రిటెక్ స్టార్టప్స్ సాధించాయని పేర్కొంది. గత ఏడాది కాలంగా వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ వినియోగం బాగా పెరిగింది. దేశంలో లాక్డౌన్ విధించిన కాలంలో అగ్రిటెక్ స్టార్టప్స్ పనితీరు మీద క్యాపిటల్ మేనేజ్మెంట్ అడ్వైజరీ ఓమ్నీవోర్ ఓ సర్వేను నిర్వహించింది. కరోనా ప్రారంభమైన ఏడాది కాలంలో 85% అగ్రిస్టార్టప్స్కు డిమాండ్ పెరిగిందని.. 51% స్టార్టప్స్ కరోనా కంటే మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 50% వృద్ధిని సాధించాయని తెలిపింది.
కోతకు ముందు, తర్వాత సేవలు..
అగ్రి స్టార్టప్స్ సేవలను పంట కోతకు ముందు, తర్వాత అని రెండు రకాలుగా విభజించవచ్చు. క్రిషితంత్ర, మారుట్ డ్రోన్స్, క్రాపిన్ వంటి కంపెనీలు వాతావరణం, నేల రకాన్ని పరీక్షించడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాల ఎంపిక, ఆర్థిక ప్రోత్సాహం వంటి పంట కోతకు ముందు సేవలను అందిస్తున్నాయి. నిన్జాకార్ట్, ఓరిగో, క్రోఫామ్, ఫామ్లింక్, వంటి కంపెనీలు పంట ఉత్పత్తుల సప్లయి, గిడ్డంగులు, మార్కెటింగ్, ధర ఎంపిక, చెల్లింపుల విధానం వంటి పంట తర్వాత సేవలను అందిస్తున్నాయి. అగ్రిస్టార్టప్స్తో పొలంలో భౌతికంగా పనిచేయాల్సిన అవసరం సగానికి పైగా తగ్గుతుంది.
వ్యవసాయ కూలీల కొరత, క్రిమిసంహారకాల పిచికారీతో ఆరోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు రైతులకు అధిక పంట దిగుబడులను, లాభాలను ఆర్జించవచ్చు. కార్మికుల వ్యయం, ఎరువుల వాడకం, సమయం వంటి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందని మారుట్ డ్రోన్టెక్ సీఈఓ ప్రేమ్కుమార్ విస్లావత్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, తాండూర్, పాలెం, కంపసాగర్ ప్రాంతాల్లోని సుమారు 3,200 మంది రైతులు, 10,800 ఎకరాలలో డ్రోన్స్తో పిచికారి, ఫామ్ ఫీల్డ్ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
దేశంలో అగ్రిస్టార్టప్స్ వృద్ధికి ప్రధాన కారణాలివే...
ఏ స్టార్టప్స్ ఏ సేవలందిస్తున్నాయంటే?
చదవండి: