తమిళనాడు: అన్నాడీఎంకేలో డిప్యూటీ చిచ్చు.. పోలీసుల అదుపులో ఈపీఎస్‌ వర్గం

19 Oct, 2022 10:57 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్‌), అన్నాడీఎంకేలో ఆయన అనుకూల వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను రాజారత్నం మైదానంలో నిర్బంధించారు. నల్ల చొక్కాలతో అసెంబ్లీ ఎదుట నిహారదీక్షకు ఆయన సిద్ధపడిన క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. 

అన్నాడీఎకేం వర్గపోరులో డిప్యూటీ చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గ నేత అయిన పళని స్వామి..  పార్టీ తరపున డిప్యూటీ నేతగా తాజాగా ఆర్బీ ఉదయకుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఓ పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)ను డిప్యూటీ లీడర్‌గా తొలగించాలని, అసెంబ్లీలో ఓపీఎస్‌ సీటును తన పక్క నుంచి వేరే చోటుకి మార్చాలని స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. అయినా చర్యలు లేకపోవడంతో.. స్పీకర్‌ చర్యను నిరసిస్తూ పళనిస్వామి నిరహార దీక్షకు దిగారు. 

దీంతో ఈపీఎస్‌ వర్గీయుల నినాదాల హోరుతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతకు తెర లేపింది. ఈ క్రమంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు పళనిని, ఆయన వర్గీయులను పోలీసులు అదుపులోకి ప్రత్యేక వాహనంలో తీసుకున్నారు. పళనిస్వామి వర్గంలోని ఉదయ్‌కుమార్‌ను తాజాగా అన్నాడీఎంకే  ఉప నేతగా కార్యవర్గం ఎన్నుకుంది. మరోవైపు అసెంబ్లీలో తన పక్కన సీటులో పన్నీర్‌ సెల్వంను కూర్చోనివ్వొద్దంటూ స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. ఈ విషయమై మంగళవారం అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగగా.. మార్షల్స్‌ సాయంతో ఈపీఎస్‌ను ఆయన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్‌ బయటకు పంపించేశారు. 

ఇక సీటింగ్‌ విషయమై తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని..  ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్‌ అప్పావు చెప్తున్నారు. అయితే పళనిస్వామి మాత్రం అధికార పార్టీ ఆదేశాలతోనే పన్నీర్‌ సెల్వం వర్గానికి స్పీకర్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మంగళవారం అసెంబ్లీలో గొడవ జరిగినప్పుడు.. పన్నీర్‌సెల్వం ప్రశాంతంగా పళనిస్వామి పక్క సీటులోనే కూర్చోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు