శశికళ పిటిషన్‌ను నిరాకరించండి

11 Apr, 2021 07:45 IST|Sakshi

అన్నాడీఎంకే అభ్యర్థన 

సిటీ సివిల్‌ కోర్టు నోటీసు

చెన్నై ‌: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి వ్యతిరేకంగా శశికళ దాఖలు చేసిన పిటిషన్‌ను నిరాకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టు నోటీసులిచ్చింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆస్తులు కూడబెట్టిన కేసులో శశికళ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ను తొలగించారు. వారిని పార్టీ నిర్వాహకులుగా ఎన్నుకోవడం చెల్లదంటూ 12 తీర్మానాలను ప్రవేశపెట్టారు.

ఆ తీర్మానాలు చెల్లవని ప్రకటించా లని కోరుతూ శశికళ, టీటీవీ దినకరన్‌ మద్రాసు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా అమముక పార్టీని స్థాపించి నడుపుతున్నందున ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు టీటీవీ దినకరన్‌ తన న్యాయవాది ద్వారా తెలియజేశారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో శశికళ దాఖలు చేసిన కేసును నిరాకరించాలని అన్నాడీఎంకే తరపున పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ స్వీకరించిన న్యాయమూర్తి రవి పిటిషన్‌కు బదులివ్వాలంటూ శశికళకు నోటీసు పంపాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. అనంతరం విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. 

శశికళ పోయెస్‌ గార్డెన్‌ ఇంటి సందర్శన
శశికళ శుక్రవారం పోయెస్‌ గార్డెన్‌లో నిర్మిస్తున్న తన ఇంటిని సందర్శించారు. ఆ సమయంలో వివేక్‌ జయరామన్, శశికళ బంధువులు ఆమె వెంటవున్నారు. వేదనిలయం తరహాలో ఈ ఇంటి నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడి పనులను త్వరగా ముగించాలని శశికళ సూచించినట్లు తెలిసింది.
చదవండి: అమిత్‌ షా రాజీనామా చేయాలి

మరిన్ని వార్తలు