‘సూర్య నమస్కారాల’ సర్క్యులర్‌.. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఖండన

5 Jan, 2022 07:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 30 వేల విద్యా సంస్థల్లోని 3 లక్షల మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయాలంటూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) జారీ చేసిన సర్క్యులర్‌పై అలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కార్యక్రమాల్లో ముస్లిం విద్యార్థులు పాల్గొనరాదని పిలుపునిచ్చారు. యూజీసీ డిసెంబర్‌ 29వ తేదీన జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో.. ‘దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని 75 కోట్ల సూర్యనమస్కారాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం జనవరి ఒకటి నుంచి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షల విద్యార్థులు సూర్యనమస్కారాల్లో పాల్గొంటారు’ అని పేర్కొంది. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలేద్‌ రహమానీ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మెజారిటీ సంప్రదాయాలు, సంస్కృతిని ఇతరులపై రుద్దాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

మరిన్ని వార్తలు