ఎయిర్‌ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం.. ‘నేను అసలు ఆ పని చేయలేదు’

13 Jan, 2023 17:30 IST|Sakshi

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు.

ఈ మేరకు కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. కాగా విచారణ నిమిత్తం శంకర్‌ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక​ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం

అసలేం జరిగిందంటే..
గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్‌ మిశ్రా  అనే వ్యక్తి సహప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేశాడు. ఎయిరిండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా పరారీలో ఉన్నాడు.

దీంతో పోలీసులు అతనిపై లుకౌట్‌ పోలీసులు జారీ చేసిన తర్వాత నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఎయిర్‌ ఇంఇయాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది,  ఈ చర్య అనంతరం మిశ్రాను ఉద్యోగంలో నుంచి తీసేశారు.  మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ శనివారం కోర్టు ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు