Akhilesh Yadav: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

16 Feb, 2022 20:26 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూపీలోని కర్హాల్ వెళ్తుండగా మార్గమధ్యలో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నుంచి బఘేల్ క్షేమంగా బయటపడ్డారు. కానీ, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఆయనపై సమాజ్‌వాదీ పార్టీ చెందిన వారే దాడి చేశారంటూ ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతున్నారనే భయంతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది. శాంతి భద్రతల అంశం వారి చేతిలోనే ఉంది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చాకే పారిశ్రామికవేత్తలందరూ బ్యాంకులను లూటీ చేసి పారిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఘటనలు ఎక్కువవుతాయని అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సత్యపాల్.. కర్హల్ నియోజకవర్గం బీజేపీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ సీఎం అభ్యర్థి అఖిలేష్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు