ఇక టోల్‌ప్లాజాలు తొలగిస్తాం!

18 Mar, 2021 15:45 IST|Sakshi

న్యూ ఢిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో నితిన్ గడ్కరీ “వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ”పై ఒక ప్రకటన చేశారు. "ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలు తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు. 

ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నారు, మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉపయోగించి టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.

టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపు రుసుమును సులభతరం చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్స్ వ్యవస్థను దేశంలో మొదటి సారిగా 2016లో ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి వాహనాలకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఒకవేల ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాలలో రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాల్లో ఫాస్‌ట్యాగ్‌లు అమర్చినట్లు గడ్కరీ చెప్పారు. పాత వాహనాలకు ఉచిత ఫాస్‌ట్యాగ్‌లను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

చదవండి:

2020లోనూ స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు

మరిన్ని వార్తలు