బడ్జెట్‌ సెషన్‌కు సిద్ధం.. 30న అఖిలపక్ష భేటీ

20 Jan, 2021 12:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో వర్చువల్‌ విధానంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పార్టీల పార్లమెంటరీ నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. 

సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోషి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న శాసన వ్యవహారాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడతగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈసారి పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కొత్తగా ఉండనుంది. ఉదయం రాజ్యసభ కొనసాగితే లోక్‌సభ సాయంత్రం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చేయనున్నారు.

మరిన్ని వార్తలు