అంబానీ ఇంటి వద్ద కలకలం కేసు: సచిన్‌ వాజేకు షాక్‌

11 May, 2021 20:15 IST|Sakshi

ముంబై: పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్‌ వాజే ఇక మాజీ పోలీస్‌ అధికారిగా మారిపోయాడు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ముంబై పోలీస్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అతడిని తాజాగా మంగళవారం పోలీస్‌ శాఖ నుంచి  పంపించేశారు. పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా సచిన్‌ వాజే పేరు ప్రఖ్యాతులు పొందారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు.

పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ ఫిబ్రవరి 25న ముకేశ్‌ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల నిలిపి ఉన్న కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలతో పట్టుబడిన స్కార్పియో యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మృతి కేసులో వాజే.. ఎన్‌ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా శాఖపరమైన చర్యలు ముంబై పోలీసులు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది.

చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ
చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా 

మరిన్ని వార్తలు