రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌

23 Apr, 2021 12:50 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు రోజుకు 20 వేలను తాకుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ అనకుండానే అటువంటి చర్యలను ముమ్మరం చేసింది. ఒకరకంగా హాఫ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. గురువారం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రమంతటా 144వ సెక్షన్‌ను విధించింది. ప్రజలు గుంపులుగా తిరగరాదని, పని లేకుండా బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. బట్టలషాపులు, మాల్స్, థియేటర్లు, కిరాణా షాపులను, బేకరీలను కూడా మూసేయించారు. బస్సులు, రవాణా వ్యవస్థను మినహాయించారు. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ, శని–ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించడం తెలిసిందే. ఈ నిషేధాజ్ఞలు మే 4వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభు త్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలను ముమ్మరం చేశారు.  

కరోనా నుంచి కోలుకున్న సీఎం యడ్డి 
సాక్షి, బెంగళూరు: కరోనా బారిన పడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కోలుకున్నారు. ఈ నెల 16న ఆయనకు పాజిటివ్‌ అని తేలగా, అప్పటినుంచి బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు గురువారం పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు. అక్కడి నుంచి అధికారిక నివాసమైన కావేరి బంగ్లాకు చేరుకున్నారు. తనకు విశ్రాంతి అవసరం లేదని, అధికారిక సమావేశాలను నిర్వహిస్తానని తెలిపారు. కరోనా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన కరోనాకు గురై కోలువడం ఇది రెండవసారి. 

చదవండి: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి
తమ్ముడి వరుస అబ్బాయితో గర్భం.. కుటుంబీకులే ప్రసవం!

మరిన్ని వార్తలు