అంతర్జాతీయ మద్దతు: అమిత్‌ షా ఆగ్రహం

4 Feb, 2021 08:53 IST|Sakshi

తీవ్ర దుమారం రేపుతున్న ట్విటర్‌ వార్‌ 

ఇటు కేంద్రానికి అటు రైతులకు మద్దతు

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాదస్పద రైతు చట్టాలను నిరశిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు రైతు దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి ట్విటర్‌ వేదికగా రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్శకులు చేస్తున్న ఉద్యమం విజయవంతం కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ ప్రపంచ ప్రముఖులు చేస్తున్న ట్వీట్‌పై భారత్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. భారత ఐక్యతకు కట్టుబడి ఉండాలంటూ వారికి ధీటుగా సమాధానిమిస్తున్నారు. భారతదేశ ఐకత్యను ఎవరూ దెబ్బతీయలేరంటూ సోషల్‌ మీడియా వేదికగా సమాధానమిస్తున్నారు.  సినీ నటుడు అక్షయ్‌ కుమార్‌,అజయ్‌ దేవగన్‌తో పాటు టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో పాటు కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు కేంద్రానికి మద్దతుగా నిలిచారు. (రైతు ఉద్యమంపై ట్వీట్‌ వార్‌)

ట్విటర్‌ వేదికగా సాగిన ఈ వార్‌ పెను దుమారమే రేపుతోంది. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. మరోవైపు సాగుచట్టాలపై రైతుల ఆందోళనకు అంతర్జాతీయ మద్దతుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో బ్రిటన్ పార్లమెంట్‌కు లక్షకుపైగా సంతకాలు పంపడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. సంతకాలు చేసిన వారిలో పలువురు భారత సంతతి సభ్యులు కూడా ఉన్నారు. అంతర్జాతీయ ప్రముఖుల మద్దతుపై విదేశాంగ శాఖ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. రైతుల ధర్నాకు ప్రముఖుల మద్దతును ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బతీయలేదన్నారు. అభివృద్ధే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. 

కాగా రైతు దీక్షలకు మద్దతుగా పర్యవరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బెర్గ్‌, అమెరికా ఉపాక్ష్యరాలు కమలా హ్యారిస్‌ మేనకోడలు మీనా, మాజీ పోర్న్‌స్టార్‌ మియా ఖలిఫా వంటి వారు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్నామని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం దేశ వ్యాప్తంగా పెద్ద  ఎత్తున చర్చకు దారితీస్తోంది. 

>
మరిన్ని వార్తలు