అమిత్‌ షాకు బెంగాల్‌ కోర్టు సమన్లు

19 Feb, 2021 18:04 IST|Sakshi
అమిత్‌ షా (ఫైల్‌ ఫోటో)

అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి సమన్లు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు భారీ షాక్‌ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్‌ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్‌ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అమిత్‌ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. 

ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాక అమిత్‌ షా మీద ఐపీసీ సెక్షన్‌ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు.

తృణమూల్‌ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ  నోటీసులు జారీ చేసింది.  2018 ఆగస్టు 11న కోల్​కతాలో మాయో రోడ్‌లో  బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్​ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్​ సంజయ్​ బసు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

చదవండి: దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్‌

మరిన్ని వార్తలు