‘ముంబై మానవత్వం కోల్పోయింది’

4 Aug, 2020 12:02 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్‌ ముంబై నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై తన మానవత్వాన్ని కోల్పోయిందన్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే దర్యాప్తు విషయంలో బిహార్‌, మహారాష్ట్ర పోలీసుల మధ్య కోల్డ్ వారికి దారితీసింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే జీవించడానికి ముంబై మహానగరం సురక్షితం​ కాదనిపిస్తోందన్నారు. (నొప్పి లేకుండా చనిపోవడం ఎలా?.. గూగుల్‌లో సుశాంత్‌ సెర్చ్‌)

‘సుశాంత్‌ సింగ్‌ కేసులో పోలీసులు వ్యవహిరిస్తున్న తీరు చూస్తే ముంబై మానవత్వం కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమృత ఫడ్నవిస్‌ వ్యాఖ్యలను శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ తప్పు పట్టారు. రాష్ట్ర బీజేపీ నాయుకులు రాజకీయం చేస్తూ ముంబై పోలీసులను నిందిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులను నిందించే వారు తమ భద్రత కోసం ప్రైవేట్‌ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్‌ పోలీసులను నిందించటం సిగ్గుచేటన్నారు.

మరిన్ని వార్తలు