ముంబై: పలు దేశాల్లో కరోనావైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా తిరిగి తన ప్రతాపాన్ని మళ్లీ చూపుతోంది. ఇదే తరహాలో జపాన్లోని ఒసాకా నగరాన్ని ఈ వైరస్ కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వర్తమాన అంశాలతో నెటిజన్లను పలకరించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. తాజాగా తన ట్వీట్ ద్వారా జపాన్కు ఓ సలహా ఇచ్చారు.
మహీంద్రా తన ట్వీట్లో.. కరోనా పై పోరాటంలో, వైద్యసౌకర్యాలపరంగా ‘జపాన్ మోడల్’ అద్వితీయమైంది. అయితే ఎవరూ ఇక్కడ సురక్షితంగా లేరు. భారత్ను విమర్శించడం మానుకోవాలి. మనమంతా కలిసికట్టుగా కరోనాను ప్రపంచం నుంచి తరిమేయాల్సి ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒసాకా నగరం ‘ముంబయి మోడల్’ని అనుసరించేందుకు ప్రయత్నించాలని తెలిపారు.
ప్రపంచంలో అనేక దేశాలు కరోనాతో అల్లాడిపోతుంటే జపాన్ దేశం మాత్రం ఆ మహమ్మారిని మొదట్లో బాగానే కట్టడిచేసింది. కానీ, ఇటీవల ఒసాకా నగరంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. అక్కడి ఆస్పత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వైద్యసేవలు అందడం కష్టమైపోతుందని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబయి నగరం రెండో వేవ్లో మెరుగైన కట్టడి చేస్తోంది. ఫిబ్రవరిలో మంబైలో కరోనా కేసులు భారీగా పెరగడం ప్రారంభమైంది. అయితే మే తరవాత నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చి, కేసులు తగ్గుముఖం పట్టాయి. ‘కచ్చితమైన ప్రణాళిక, సత్వర చర్యలు, స్మార్ట్ పద్ధతిలో సమాచార మార్పిడి, అవసరమైన చోట ఖర్చుపెట్టేందుకు ముందుకురావడం’ వంటి చర్యల వల్లే కొవిడ్ను కట్టడి చేయగలిగామని ఆ నగర కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానాలనే అనుసరించాలని మహీంద్రా ఒసాకా నగర యంత్రాంగానికి తన ట్వీట్ ద్వారా సూచించారు.
The ‘japanese model’ of fighting Covid & their health infrastructure was envied. But yes, “No one’s safe anymore.” The India-bashing should stop & we need to understand that we have to heal the world TOGETHER. Osaka should try the ‘Mumbai Model.’ https://t.co/GHDoPRCruk— anand mahindra (@anandmahindra) May 25, 2021