ఏక్‌నాథ్‌ షిండేకి రక్తంతో రైతు ఆహ్వాన లేఖ!

6 Mar, 2023 16:33 IST|Sakshi

మహారాష్ట్రాలోని నాసిక్‌ జిల్లాలో ఒక రైతు తన ఉల్లి పంటకు నిప్పంటించాడు. తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోపంతో సుమారు 1.5 ఎకరాల ఉల్లి పంటకు నిప్పంటించాడు కృష్ణ డోంగ్రే అనే రైతు. ఆ పంట కోసం అని సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ తర్వాత వాటి రవాణా కోసం సుమారు రూ. 30 వేలు అదనంగా ఖర్చు చేశానని వాపోయాడు. ఇంత చేస్తే చివరికి ఉల్లి ధర మార్కెట్లో కేవలం రూ. 25 వేలు పలుకుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

నాలుగు నెలలుగా రాత్రి, పగలనక కష్టపడి 1.5 ఎకరంలో ఉల్లి పంట పండించాను, దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల కాల్చేయాల్సి వచ్చిందని ఆవేదనగా చెప్పాడు. ఈ పంట కోసం తన చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయ్యాయని అన్నాడు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించి రైతులకు అండగా నిలవాలని కోరాడు. ఈ ఘటన జరిగి 15 రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి రాకపోగా, కనీసం సానుభూతి కూడా చూపలేదని అన్నాడు.

కనీసం మమ్మల్ని మీరు ఇలా చేయకండి మేము ఆదుకుంటామన్న భరోసా కూడా ఇవ్వలేదని అతను వాపోయాడు. ఈ మేరకు రైతు కృష్ణ ఈ ఉల్లి దహనోత్సవానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు రక్తంతో కూడా ఓ లేఖ రాశానని చెప్పారు. ప్రభుత్వం తమ పంటలన్నింటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశాడు. అలాగే ప్రస్తుత నష్టాలకు గానూ అందరికీ క్విటాకు వెయ్యి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డ్రోంగే కోరాడు.    

(చదవండి: 'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..)

మరిన్ని వార్తలు