షాకింగ్‌: కరోనాతో మరో సింహం మృతి

16 Jun, 2021 20:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై:  కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను సైతం వీడటం లేదు. కోవిడ్‌తో ఇటీవల(జూన్‌3) త‌మిళ‌నాడులోని అరిగ్‌న‌ర్ అన్నా జూపార్క్‌లో ఓ మగ సింహం(నీలా) చ‌నిపోయిన విషయం తెలిసిందే.  తాజాగా చెన్నైలోని అదే జూలో బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో మరో సింహం మరణించిందని జూ అధికారులు తెలిపారు. పద్మనాథన్‌ అని పిలవబడే ఈ సింహం వయస్సు 12 ఏళ్లు. జూన్‌ 3న ఈ సింహం శాంపిల్స్‌ను భోపాల్‌లోని  వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని చెప్పారు.

కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో సింహానికి ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించామని జూ అధికారులు పేర్కొన్నారు. దీనిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. కాగా ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు.

చదవండి: అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి 
కరోనా వైరస్‌తో సివంగి మృతి

మరిన్ని వార్తలు