అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్‌.. పన్నీరు సెల్వానికి షాక్‌!

3 Jul, 2022 07:39 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై పన్నీర్‌సెల్వంను అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపాలని ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీన జరగున్న జనరల్‌బాడీ సమావేశాన్ని ఇందుకు వేదికగా మలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రిసీడియం చైర్మన్‌గా ఎన్నికైన తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ సైతం ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

వర్గపోరుతో పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేసిన నెపం చూపి క్రమశిక్షణ చర్యగా ఏకంగా పార్టీ నుంచే పన్నీర్‌సెల్వంను పంపివేసేందుకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా తన సతీమణికి కరోనా సోకడంతో కొన్నిరోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న ఎడపాడి శనివారం బయటకు వచ్చి మద్దతుదారులతో సమావేశమయ్యారు. కాగా, పార్టీలో మెజారీ్ట నాయకులు ఎడపాడివైపు మొగ్గుచూపుతుండగా, వారిని తనవైపు ఆకర్షించేందుకు పన్నీర్‌ అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నా రు. చెన్నై అడయారు గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన ఇంటిలో శనివారం పార్టీ శ్రేణులను కలిసేందుకు పన్నీర్‌ సిద్ధమయ్యారు. అయితే సాయంత్రం వరకు ఎదురుచూసినా ఏ ఒక్క నేత ఆ వైపు రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు.   

పుదుచ్చేరికీ తాకిన సెగ..
తమిళనాడులో పార్టీ పరిస్థితి ఇలా ఉండగా, ఈ సెగ పుదుచ్చేరికి సైతం వ్యాపించింది. ఏక నాయకత్వం విషయంలో పుదుచ్చేరి తూర్పువిభాగం కార్యదర్శి అన్బళగన్, పడమటి విభాగం కార్యదర్శి ఓంశక్తిశేఖర్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య విబేధాలు నెలకొనగా పార్టీ చీలిపోతుందా.. అని పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు