సోషల్‌ మీడియాలో ఫోటో వైరల్‌..

5 Nov, 2020 10:25 IST|Sakshi

మాస్క్‌, గ్లౌజులు లేకుండా వండి, వడ్డిస్తారంటూ నెటిజనుల వ్యగ్యం

భువనేశ్వర్‌: కరోనా వైరస్ మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతి శుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యింది. ఇందుకు అనుగుణంగానే నిత్యవసరాలన్ని యాంటీ వైరస్‌ ట్యాగ్‌ తగిలించుకుంటున్నాయి. పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు ఇలా ప్రతిదాన్ని వైరస్‌ ఫ్రీ అంటూ ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ టిఫిన్‌ సెంటర్‌ తెగ వైరలవుతోంది. ఎందుకంటే దాని పేరు యాంటీ వైరస్‌ టిఫిన్‌ సెంటర్‌ కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. రెడిట్‌ యూజర్‌ ఒకరు ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఓడిశా బెర్హంపూర్‌, గాంధీనగర్‌ మెయిన్‌ రోడ్డులో ఈ యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌ ఉంది. ఇక దీని మెను బోర్డు మీద ఇడ్లీ, దోశ, వడ, పూరి, ప​కోడా వంటి అన్ని రకాల టిఫిన్లు లభిస్తాయి అని ఉంది.  లివ్‌ ఆప్‌ ద ట్రెండ్‌ అనే క్యాప్షన్‌ మెను బోర్డ్‌ మీద ఉంది. ఇక పలువురు అక్కడ నిల్చూని టిఫిన్‌ చేస్తున్నారు. కూర్చీలు వంటివి ఏం లేవు.

ఇక ఈ ఫోటో చూసిన నెటిజనులు రకరకాలుగా కామెంట్‌ చేయడం ప్రారంభించారు. ఇక యాంటీ వైరస్‌ అనే పేరు వినగానే తాము ఇక్కడ ఎంతో శుభ్రంగా, శుచిగా ఉంటుందని భావించాము.. కానీ కనీసం కూర్చీలు కూడా లేవు ఇదేంటి అని కామెంట్‌ చేశారు. మరో సెక్షన్‌ మాత్రం ‘యాంటీ వైరస్‌ అంటే అతడు భోజనంలో శానిటైజర్‌ కలపడనే ఆశిస్తున్నాను’.. ‘ఇక్కడ కేవలం గ్రేడ్‌ ఏ బ్లీచ్‌ మాత్రమే కలుపుతారు’.. ‘వంట మాస్టర్‌ మూతికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు లేకుండా వంట చేస్తే.. సర్వర్లు మాస్క్‌, గ్లౌజులు ధరించకుండా చాలా శుభ్రంగా తెచ్చి మనకు వడ్డిస్తారు’.. ‘అదృష్టం బాగుంటే వంట మాస్టర్‌ ఆహారాన్ని మరింత శుభ్రంగా మార్చడం కోసం తన వెంట్రుకలను కూడా త్యాగం చేయవచ్చు’ అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా యాంటీ వైరస్‌ పేరుతో ఉన్న ఈ హోటల్‌ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న మాట మాత్రం వాస్తవం. 

మరిన్ని వార్తలు