రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!

2 Jun, 2023 21:12 IST|Sakshi

ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 

'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు.

రెజ్లర్ల ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ..

మరిన్ని వార్తలు