హనీట్రాప్‌ కేసు: అరగంట చాలు.. నేను నోరు విప్పితే సీన్‌ మారిపోతుంది!.. అర్చన సంచలన వ్యాఖ్యలు

7 Dec, 2022 08:56 IST|Sakshi

క్రైమ్‌:  హైప్రొఫైల్‌ హనీ ట్రాప్‌గా ఒడిశాలో సంచలనం సృష్టించి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది అర్చనా నాగ్‌ అరెస్ట్‌ ఉదంతం. అయితే వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన తరుణంలో మంగళవారం ఆమె మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘నేను పెదవిప్పితే రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వమే కూలిపోతుంది. అందుకు మాట్లాడేందుకు 30 నిమిషాలు అవకాశం ఇవ్వండి. కీలక ఆధారాలను మీకిస్తా’ అని అక్కడే ఉన్న మీడియాను ఉద్దేశించి అర్చన నాగ్‌ వ్యాఖ్యానించారు. ఆమె అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు అర్చన నాగ్‌ను మంగళవారం ఏడు రోజుల రిమాండుకు తీసుకున్నారు. కారాగారం నుంచి ఆమెను క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు.  

ఆసుపత్రి వద్ద అర్చన నాగ్‌ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. ఎలాంటి దర్యాప్తునకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. అని ఆమె తెలిపారు. . శ్రద్ధాంజలి బెహరా, సినీ నిర్మాత అక్షయ పరిజ ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటే తననెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. 

అధికార బీజేడీ నుంచి 20 మంది, ప్రతిపక్ష బీజేపీ నుంచి కొందరు, రాజకీయ నేతలేగాక.. వీఐపీలు, వ్యాపారవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు, నిర్మాతలు.. అర్చనా వలపు వలలో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాతో పాటు బెంగాల్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు.  హనీ ట్రాప్‌ కేసులో అర్చనతో పాటు ఆమె భర్త జగబంధు చంద్‌, ఈ జంటకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఖగేశ్వర్‌ పాత్రాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదివరకు పలువురిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి ఏడు రోజులపాటు అర్చన నాగ్‌ను విచారించనున్నారు. కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు.

సంబంధిత కథనం: పేద కుటుంబంలో పుట్టి.. అర్చనా నాగ్‌ వెర్షన్‌ డర్టీ పిక్చర్‌ ఇది!

మరిన్ని వార్తలు