‘భారత్‌ను టార్గెట్‌ చేశారు.. బ్రిటీష్‌ అరాచకాలను ఎందుకు తీయలేదు’

28 Jan, 2023 16:24 IST|Sakshi

Kerala Governor Arif Mohammad.. దేశంలో ప్రధాని మోదీ, గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డ్యాకుమెంటరీపై భారత ప్రభుత్వం బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. కాగా, ఈ బీబీసీ డాక్యుమెంటరీపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీబీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కేరళ గవర్నర్‌ ఖాన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన వారు భారతదేశంలో బ్రిటీష్‌ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదని ప్రశ్నించారు. వందల సంవత్సరాలు బ్రిటీష్‌ పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎన్నో రంగాల్లో ముందంజలో ఉంది. ఆర్థికంగా బలోపేతమై ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కొందరు నిరాశకు గురవుతున్నారు. అందుకే ఇలా డాక్యుమెంటరీ పేరుతో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్‌  అయ్యారు. 

ఇదే సమయంలో.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం ఇది. ఇప్పుడు భారత్‌ పేరును చెడగొట్టడానికే దీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడే డాక్యుమెంటరీని బయటకు తీసుకురావడాని కారణమేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్‌ ఎదుగుదలను చూడలేకనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే,  న్యాయవ్యవస్థ తీర్పులపై డాక్యుమెంటరీని విశ్వసిస్తున్న కొందరిని చూస్తే జాలివేస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు.  

మరోవైపు.. 2002 గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అల్లర్ల సమయంలో కొన్ని అంశాలను పరిశోధించినట్లు పేర్కొంటున్న రెండు భాగాల డాక్యుమెంటరీని రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్యుమెంటరీపై బీబీసీ వివరణ కూడా ఇచ్చింది. ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించిన తర్వాతనే దీన్ని రూపొందించినట్టుగా తెలిపింది. దీనికోసం అప్పటి సాక్ష్యులు, నిపుణులను సంప్రదించామని.. బీజేపీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని పేర్కొంది. 

మరిన్ని వార్తలు